Mayoral Election: రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. రాజకీయ చదరంగంలో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం మేయర్ పీఠం ఎవరిదనే అంశంపై స్పష్టతనిచ్చింది. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరవేసేందుకు మార్గం సుగమమైంది.
సమీకరణాలు ఇవే: మొత్తం 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు.
- బీజేపీ: 30 స్థానాలు
- కాంగ్రెస్: 14 స్థానాలు
- బీఆర్ఎస్: 9 స్థానాలు
- స్వతంత్రులు: 8 స్థానాలు
- ఎంఐఎం: 3 స్థానాలు
- ఇతరులు (AIFB): 2 స్థానాలు
పొన్నం వ్యూహం.. బీఆర్ఎస్ ట్విస్ట్!: కేంద్ర మంత్రి బండి సంజయ్ అడ్డాలో బీజేపీని అడ్డుకోవాలని కాంగ్రెస్ చివరివరకు భావించింది. మేయర్ రేసులో తాము సైతం ఉన్నామని మంత్రి పొన్నం ఇటీవల వ్యాఖ్యానించారు. మాది రాజకీయ పార్టీ కాబట్టి చివరి వరకు రాజకీయం చేస్తామని పొన్నం అన్నారు. దీంతో ఒక్కసారిగా కరీంనగర్ రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంటుందనే ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో బీఆర్ఎస్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్ వ్యూహాలు ఫలించలేదు.
Also read-Telangana: నేడు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక.. విప్ జారీ చేసిన పార్టీలు!
బీజేపీకి కలిసొచ్చిన బలం: బీఆర్ఎస్ తప్పుకోవడంతో సంఖ్యాబలం ప్రకారం బీజేపీ విజయం ఖాయమైంది. బీజేపీ గెలిచిన కార్పొరేటర్లతో పాటుగా స్వతంత్రులు, ఎక్స్ అఫీషియోల ఓట్లతో బీజేపీకి కావాల్సిన సంఖ్యా బలం(34) ఉండటంతో, కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఆ పార్టీ కైవసం చేసుకోవడం లాంఛనంగా మారింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి.
- బీజేపీ గెలిచిన కార్పొరేటర్లు: 30
- స్వతంత్రుల మద్దతు: 02
- ఎక్స్ అఫీషియో ఓట్లు: 02
- మొత్తం బలం: 34

