KCR Jagtial Sabha: వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు.
Also Read: https://teluguprabha.net/telangana/jeevan-reddy-joins-brs-in-the-presence-of-kcr/
‘జగిత్యాల యుద్ధం మీ వంతు.. తెలంగాణ యుద్ధం మా వంతు’ అని జీవన్రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లో హైడ్రా తెచ్చాం.. నిజామాబాద్లో నిడ్రా తెస్తామంటున్నారు.. జగిత్యాలలో జిడ్రా కూడా తెస్తారేమో..? అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఇంట్లో సామాన్లు కూడా తీసుకోనివ్వకుండా ఇళ్లు కూల్చి వేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి రాగానే.. హైడ్రాను తొలగిస్తూ తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు.
మూసీ దగ్గర ఉన్న పేదలను కూడా ఏడిపిస్తున్నారు.. 15 వేల ఇళ్లు కూలగొడతామని అనడం ధర్మమేనా..? మూసీని మంచిగా చేయడం మంచిదే.. కానీ, 15 వేల ఇళ్లు కూలగొడతారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని మాట్లాడుతున్నారని.. ఆయన వెయ్యి జన్మలు ఎత్తినా తాను చావనని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ దరిద్రం పోయే దాకా.. అన్ని వర్గాల ప్రజలు బాగుపడే వరకు సేవ చేస్తామని ఉద్ఘాటించారు.
‘గతంలో తెలంగాణ అనే పదం పలకడానికే భయపడే రోజులు. తెలంగాణ పదాన్నే నిషేధించే పరిస్థితులు. మన నీళ్లు, వనరులను దోపిడీ చేశారు. పాలమూరు వంటి జిల్లాలో 90 శాతం వలసలే. కొన్ని పార్టీల తీరుతో ఆవేశం, బాధ కలిగేవి. మూలిగే నక్కపై తాటిపండులా చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచారు. కరెంట్ ఛార్జీలు తగ్గించాలని నిరసన తెలిపితే బషీర్బాగ్లో కాల్చి చంపారు. బషీర్బాగ్ ఘటనతోనే తెలంగాణ జెండా పట్టుకుని ఉద్యమానికి వచ్చా.’ – కేసీఆర్
ఒకేసారి వెయ్యాల్సిన రైతు బంధును.. ఎకరానికి ఒకసారి వేస్తున్నారని కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రాంరాం.. దళిత బంధుకు జైభీమ్ అంటారని చెప్పానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో కరెంట్ సరిగా ఉండేదా? అని అన్నారు. తాను వచ్చాక 24 గంటల కరెంట్ ఇచ్చామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు తప్పడం లేదని ఎద్దేవా చేశారు.

