Bandi Sanjay On HYDRAA: తెలంగాణలో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. కామారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. బాన్సువాడలో ఇటీవల జరిగిన ఘటనపై దురదృష్టకరమన్న ఆయన.. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read: https://teluguprabha.net/top-stories/four-women-missing-from-the-same-family-in-sathya-sai-district/
ప్రభుత్వం బఫర్ జోన్లు, పూర్తి స్థాయి నీటి మట్టం పేరుతో పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కూల్చివేతలు ఇలాగే కొనసాగితే, కాంగ్రెస్ నాయకులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు నిర్మించిన అక్రమ కట్టడాలపై బీజేపీ కార్యకర్తలు బుల్డోజర్లతో నిరసన తెలుపుతారని హెచ్చరించారు.
‘వివక్షపూరిత చర్యలు: ప్రభుత్వం కేవలం పేదలనే లక్ష్యంగా చేసుకుంటోంది. అధికార పార్టీ నేతల అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లడం లేదు. మూసీ ఒడ్డున గాంధీ విగ్రహం పేరిట, ఖమ్మంలోని భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేతలు చేపట్టారు. బఫర్ జోన్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయి.. ఎన్ని కూల్చివేశారు.. అనే దానిపై చర్చలకు సిద్ధమా.? బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది. అవసరమైతే అధికారుల చర్యలను అడ్డుకుంటాం.’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/andhra-pradesh-tightens-teacher-attendance-rules/
బండి సంజయ్ వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ కొట్టిపారేశారు. కోర్టు తీర్పుల ప్రకారమే అక్రమ కట్టడాల తొలగింపు జరుగుతోందన్నారు. వాస్తవాలు తెలియకుండా బండి సంజయ్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

