Keto Motors Electric Bus Launch Hyderabad : హైదరాబాద్ మహానగరంలో ప్రజారవాణా వ్యవస్థ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కాలుష్యరహిత వాతావరణం, సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని బేగంపేట్ వేదికగా అధునాతన ఈవీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ‘కీటో మోటార్స్’ విద్యుత్ బస్సును కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆడంబరంగా ప్రారంభించారు.
బేగంపేటలో కీటో ఈవీ బస్సు ప్రారంభోత్సవం : హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కీటో మోటార్స్ (Keto Motors) సంస్థ రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ బస్సును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో పాటు పలువురు సీనియర్ అధికారులు, కీటో మోటార్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్యాన్ని నివారించేందుకు ఈవీ బస్సులు గేమ్ చేంజర్ కానున్నాయని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.
విస్తరిస్తున్న ఆర్టీసీ ఈవీ నెట్వర్క్ : ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఎలక్ట్రిక్ బస్సులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ రోడ్లపై 1,050 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. నగరాల మధ్య సుదూర ప్రయాణాలకు గాను (Inter-city operations) ఇప్పటికే 500 ఈవీ బస్సులను వినియోగిస్తున్నారు.
‘పీఎం ఈ-డ్రైవ్’ పథకంతో భారీ ఊతం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకం ద్వారా ప్రజారవాణా రంగంలో ఈవీల వ్యాప్తి శరవేగంగా జరుగుతోంది. పీఎం ఈ-డ్రైవ్ కింద ఆర్టీసీకి మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. కొత్తగా వచ్చే ఈ బస్సులతో నగర, అంతర్జిల్లా సర్వీసుల్లో డీజిల్ వినియోగం గణనీయంగా తగ్గనుంది.
కాలగర్భంలోకి డీజిల్, పెట్రోల్ వాహనాలు : పర్యావరణ మార్పులపై దృష్టి సారిస్తూ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదేళ్ల కాలంలో రోడ్లపై డీజిల్, పెట్రోల్ వాహనాల సంఖ్య భారీగా తగ్గిపోతుందని, వాటి స్థానంలో 100% పర్యావరణహిత విద్యుత్ వాహనాలే రాజ్యమేలుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

