KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల రక్షణను గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రస్తుత పరిపాలనను ఆయన తుగ్లక్ పాలనతో పోల్చారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియాపై వేధింపులు: ప్రజా సమస్యలను పక్కనపెట్టి, బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టులపై పడి ఏడవడం ఏంటని ప్రశ్నించారు. నాయకులను వేధించడమే పనిగా రేవంత్ సర్కార్ పెట్టుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 13 డిక్లరేషన్లతో పాటు ఇతర హామీలను అమలు చేసే వరకు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
శాంతిభద్రతల వైఫల్యం: కరీంనగర్లో పట్టపగలే జ్యువెలరీ షాపుపై దుండగులు దాడి చేసి నలుగురిని ప్రాణాపాయ స్థితికి చేర్చినా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేని స్థితిలో తెలంగాణ ఉందని అన్నారు. హామీలు నెరవేర్చకుండా కేవలం ప్రతిపక్షంపై కక్షసాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని కేటీఆర్ మండిపడ్డారు.

