KTR writes open letter to Rahul Gandhi: ఇంజినీరింగ్ విద్యార్థులను, ఇంజినీర్లను, అధ్యాపకులను “క్రిమినల్ వేస్ట్” అని సంబోధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. సదరు లేఖలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. సీఎం వ్యాఖ్యలపై స్పందించాలని, క్షమాపణ చెప్పించే నైతిక బాధ్యత రాహుల్ గాంధీపైనే ఉందని స్పష్టం చేశారు. భారతీయ ఇంజినీర్లు ప్రపంచంలోనే అగ్రగామి గ్లోబల్ కంపెనీలను నడుపుతున్నారని, అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతూ దేశ ప్రగతికి, లక్షల మంది ఉపాధికి బాటలు వేస్తున్నారని, ప్రపంచ దేశాలు భారతీయ ఇంజినీర్లను మెచ్చుకుంటున్న క్రమంలో సీఎం రేవంత్ వారిని కించపరిచే వ్యాఖ్యలు చేయడం సోచనీయమన్నారు. అలాంటి అత్యున్నత ప్రతిభ కలిగిన విద్యార్థులను, గురువులను సీఎం ‘క్రిమినల్ వేస్ట్’ అనడం అత్యంత దారుణమని గుర్తు చేశారు.
Also Read: Rain : భానుడి భగభగలకు విరామం… కుండపోత వర్షంతో తడిసిముద్దయిన భాగ్యనగరం
ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం?
దేశ రక్షణ, సాంకేతిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్గా చూడటమే కాంగ్రెస్ పార్టీ విధానమా? దీనిపై ఇంజినీర్లకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు స్పష్టతనివ్వాలని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మౌనంగా ఉండడం అంటే ఆ వ్యాఖ్యలను ఆయన సమర్థించినట్లేనని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ నిరభ్యంతరంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేత కూడా క్షమాపణ చెప్పించాలన్నారు. గతంలోనూ రేవంత్ రెడ్డి యూనివర్సిటీ విద్యార్థులను ‘బీరు బిర్యానీ బ్యాచ్’ అని అవమానించారని, ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై అడ్డగోలుగా నోరు పారేసుకోవడం ఆయనకు పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “యువత రేపటి భారత భవిష్యత్తుకు నిర్మాతలు అన్న విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలి. విద్యార్థులు, యువతతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇందిరమ్మ ఎమర్జెన్సీ సమయంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలోనే ఆ పార్టీకి అనుభవమైంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ యువత కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకుంది. యువతను అడుగడుగునా మోసం చేసిన కాంగ్రెసే అసలైన ‘క్రిమినల్ వేస్ట్. వచ్చే రోజుల్లో తెలంగాణ యువత ఈ వ్యాఖ్యలకు తగిన సమాధానం చెప్తుంది. యువతను అన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయం.” అని కేటీఆర్ తన లేఖలో తీవ్ర హెచ్చరించారు.

