Commercial Cylinders: కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై పెట్రోలియం కంపెనీల నియంత్రణతో హోటల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. హోటళ్లకు సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అత్యవసర సర్వీసులైన ఆస్పత్రులు, హాస్టళ్లకే కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో హోటల్ యజమానులు ఆందోళనలో పడ్డారు.
Also Read: https://teluguprabha.net/gallery/vijay-rashmika-couple-mehandi-celebrations-photos/
పలు హోటళ్లు మూసివేత
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు కొరత.. ప్రజలను ఇబ్బందుల్లో పడేస్తోంది. అయితే భారత్లో మాత్రం పెట్రోల్, డీజిల్ ఇబ్బందులు లేవని.. సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన పడొద్దని సూచించింది. కానీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రం కేంద్రం పలు పరిమితులు విధించింది. కేవలం గృహ అవసరాలకు మాత్రమే సిలిండర్లు సరఫరా చేయాలని వెల్లడించిన కేంద్రం.. బుకింగ్ గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హోటళ్లు తాత్కాలికంగా మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీలలోని పలు హోటళ్లు తాత్కాలికంగా మూతబడ్డాయి.
అత్యవసర సమావేశం
కాగా, వాణిజ్య గ్యాస్ సిలిండర్ కొరత ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హోటళ్లపై కూడా చూపిస్తోంది. హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లను పెట్రోలియం కంపెనీలు ఆదేశించాయి. దీంతో హోటల్, రెస్టారెంట్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో తమ వ్యాపారానికి గండిపడిందని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు చూపించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హోటళ్ల బంద్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సికింద్రాబాద్లో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్యాస్ కొరతతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన చెందుతున్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/telugu-rajendra-prasad-sensational-comments-on-late-mgr/
రేపటి నుంచి మరింత తగ్గొచ్చు
మరోవైపు ఏపీలోనూ ఇదే పరిస్థితి కనపడుతోంది. రాష్ట్రంలో వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని విశాఖ హోటల్ మర్చంట్ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ పేర్కొన్నారు. సిలిండర్ల సరఫరా రేపటి నుంచి మరింత తగ్గవచ్చని చెప్పారు. విశాఖపట్నంలో ఇప్పటి వరకు బ్లాక్ మార్కెట్ నడుస్తోందని, పరిస్థితి ఇలాగే ఉంటే నిర్వహణ కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాణిజ్య సిలిండర్ల కొరతపై కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. గ్యాస్ కొరత లేకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చూడాలని విజ్ఞప్తి చేశారు.

