Woman Murder: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ప్రేమ పేరుతో ఓ యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో యువతి గొంతు కోశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన యువతి ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సదరు యువతిని ప్రేమించాలంటూ వెంటపడగా, ఆమె అతని ప్రేమను నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ఉన్మాది, యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందింది.
Also Read: https://teluguprabha.net/telangana/key-update-on-bandi-bhagirath-pocso-case/
గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని బంధించి తీవ్రంగా దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

