Helicopter services for Medaram Jatara : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం ఓ అద్భుతమైన అవకాశం కల్పించింది. ట్రాఫిక్ కష్టాలు లేకుండా, గగన మార్గంలో నేరుగా వనదేవతల చెంతకు చేరేందుకు, ప్రత్యేక హెలికాప్టర్ సేవలను ప్రారంభించింది. రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. మేడారం మహా జాతరకు కోట్లాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం, రాష్ట్ర పర్యాటక శాఖ, ‘తుంబి ఎయిర్లైన్స్’ సహకారంతో ఈ ప్రత్యేక హెలికాప్టర్ సేవలను ఏర్పాటు చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు, 9 రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
రెండు మార్గాలు.. ధరల వివరాలు : భక్తుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని, రెండు హెలికాప్టర్లతో, రెండు వేర్వేరు మార్గాలలో ఈ సేవలను అందిస్తున్నారు.
హనుమకొండ – మేడారం : హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి మేడారానికి, తిరిగి మేడారం నుంచి హనుమకొండకు ఈ సర్వీసు నడుస్తుంది. ఒక్కొక్కరికి రూ.35,999గా నిర్ణయించారు.
ఏరియల్ వ్యూ : తాడ్వాయి మండలం, పడిగాపూర్ హెలీప్యాడ్ నుంచి ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఇది మేడారం పరిసర ప్రాంతాలను గగన వీధి నుంచి వీక్షించే ‘ఏరియల్ వ్యూ’ రైడ్.
టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.4,800గా ఖరారు చేశారు.
జాతరకు ఆర్టీసీ బస్సుల జోరు : హెలికాప్టర్ సేవలతో పాటు, సామాన్య భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ కూడా భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 50కి పైగా ప్రాంతాల నుంచి, జనవరి 25 నుంచి 31 వరకు, 3,495 ప్రత్యేక బస్సులను నడపనుంది. అయితే, ఈ ప్రత్యేక బస్సులలో 50% అదనపు ఛార్జీని వసూలు చేయనున్నారు.
మహాలక్ష్మి పథకం వర్తింపు: ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులలో ‘మహాలక్ష్మి’ ఉచిత ప్రయాణ పథకం యథాతథంగా వర్తిస్తుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. డారంలో 50 ఎకరాల విస్తీర్ణంలో, 76 సీసీ కెమెరాలతో కూడిన తాత్కాలిక బస్టాండ్ను ఏర్పాటు చేశారు. ఈసారి జాతరకు ప్రభుత్వం రూ.251 కోట్లు కేటాయించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు.

