Merit scholarships for workers’ children : పిల్లల చదువుల కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. చదువులో ప్రతిభ కనబరిచే కార్మికుల పిల్లలను ప్రోత్సహించేందుకు, కార్మిక సంక్షేమ మండలి ‘మెరిట్ ఉపకార వేతనాల’కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి నుంచి పీజీ వరకు, వివిధ కోర్సులు చదివే విద్యార్థులకు ఈ ఆర్థిక చేయూత లభించనుంది. అసలు ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎంత ఉపకార వేతనం లభిస్తుంది? దరఖాస్తు చేసుకోవడం ఎలా?
తక్కువ వేతనాలతో పనిచేసే కార్మికులకు, తమ పిల్లల ఉన్నత చదువులు ఓ పెనుభారంగా మారుతున్నాయి. ఈ భారాన్ని తగ్గించి, వారి పిల్లలను ప్రోత్సహించే లక్ష్యంతో, కార్మిక సంక్షేమ మండలి ఏటా ఈ మెరిట్ ఉపకార వేతనాలను అందిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను, ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తోంది.
ఎవరు అర్హులు : దుకాణాలు, పరిశ్రమలు, మోటారు రవాణా రంగం, సహకార సంస్థలు వంటి అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు ఈ ఉపకార వేతనాలకు అర్హులు.
ఎంపిక విధానం: విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో సాధించిన మార్కుల (మెరిట్) ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒక కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు విద్యార్థులకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
ఎంత ఉపకార వేతనం లభిస్తుంది : చదివే కోర్సును బట్టి, ఉపకార వేతనం మొత్తం మారుతుంది.
రూ.1,000: పదో తరగతి, ఐటీఐ విద్యార్థులకు.
రూ.1,500: పాలిటెక్నిక్ విద్యార్థులకు.
రూ.2,000: ఇంజినీరింగ్, మెడిసిన్, న్యాయ విద్య, బీఎస్సీ అగ్రికల్చర్, నర్సింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే వారికి.
రూ.4,000: దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ మొత్తం అందిస్తారు.
ఈ ఉపకార వేతనాన్ని నేరుగా విద్యార్థి లేదా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా : ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. తల్లిదండ్రుల కార్మిక గుర్తింపు కార్డు, విద్యార్థి ఆధార్ కార్డు, ఫోటో, బోనఫైడ్ సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా పుస్తకం, గత ఏడాది మార్కుల జాబితా, ఆదాయ ధ్రువీకరణ పత్రం. ఈ పత్రాలను జతపరిచి, మీ సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తును సమర్పించాలి.
“అర్హులైన కార్మికుల పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 15. మరిన్ని వివరాలకు సహాయ కార్మిక కమిషనర్ కార్యాలయంలో సంప్రదించవచ్చు.”
– రవీందర్రెడ్డి, ఉపకమిషనర్, కార్మిక శాఖ, సంగారెడ్డి
ఈ ఉపకార వేతనాలు, ఎందరో పేద, ప్రతిభావంతులైన విద్యార్థులు తమ ఉన్నత విద్యా కలలను సాకారం చేసుకోవడానికి దోహదపడనున్నాయి.

