BRS vs Congress: రాష్ట్రంలో రాజకీయ వేడి రోజురోజుకి రాజుకుంటోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని.. ఆ వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్ నగర శివారులో ఫ్యూచర్ సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇది రియల్ ఎస్టేట్ దందా అని.. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. దీనిపై మంత్రి పొంగులేటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు బీఆర్ఎస్కు అసలు ఫ్యూచర్ లేదు.. కానీ కాంగ్రెస్ నిర్మించే ఫ్యూచర్ సిటీకి తిరుగులేదంటూ పొంగులేటి X వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
Also Read: https://teluguprabha.net/national-news/new-green-card-rules-in-america/
‘బీఆర్ఎస్లో మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియదు. అమెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటామంటారా?. ఫ్యూచర్ సిటీ భూములపై ఎవరితో ఒప్పందాలు చేసుకున్నారు.? రాష్ట్రం కోసం ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంటే అడ్డుకుంటున్నారు. మూసీ ప్రాజెక్ట్, లగచర్ల ఇండస్ట్రీస్కు అడ్డుపడ్డారు. యువతకు ఉద్యోగాలు వస్తుంటే కుట్రలు చేస్తున్నారు. బీఆర్ఎస్కు ఫ్యూచర్ లేదు. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు’- మంత్రి పొంగులేటి
బీఆర్ఎస్ పార్టీలో అసలు హరీశ్రావు ఫ్యూచర్ ఏంటో ఆయనకే స్పష్టత లేదని పొంగులేటి ఎద్దేవా చేశారు. హరీశ్రావు పొలిటికల్ ఫ్యూచర్ను ఖతం చేయడానికి ఆయన మామ కేసీఆర్, బామ్మర్ది కేటీఆర్ చూస్తున్నారని విమర్శించారు. అలాంటిది ఆయన ఫ్యూచర్ సిటీని ఆపుతారా అని ప్రశ్నించారు.
Also Read: https://teluguprabha.net/national-news/fire-breaks-out-at-hydroelectric-power-plant-in-odisha/
బీఆర్ఎస్ పదేళ్ల పరిపాలనలో హైదరాబాద్లో కనీసం ఒక్క కొత్త మెట్రో స్టేషన్ కూడా కట్టలేకపోయారని పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశం గర్వించే విధంగా ఒక సరికొత్త నగరాన్ని నిర్మిస్తుంటే ఓర్వలేక, కేవలం అసూయతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు వారి స్వప్రయోజనాల కోసం ఎక్కడ పడితే అక్కడ ఫామ్హౌస్లు కట్టుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రం, దేశ భవిష్యత్తు కోసం ఫ్యూచర్ సిటీని కడుతుంటే, పగటి కలలు కంటూ దాన్ని రద్దు చేస్తామనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజల ఆశీస్సులతో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

