Minister Seethakka Prajalatho Mukhamukhi Gandhi Bhavan : రాష్ట్రంలోని మూలమూలల నుంచి విచ్చేసిన బాధితుల రద్దీతో గాంధీ భవన్ పరిసరాలు కిటకిటలాడాయి. ‘ప్రజలే ప్రభుత్వానికి కేంద్రబిందువు’ అనే ఉదాత్త భావనతో ప్రతి బుధవారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న “ప్రజలతో ముఖాముఖి” కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ ప్రజా దర్బార్లో మంత్రి సీతక్క స్వయంగా పాల్గొని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి నేరుగా వినతిపత్రాలను స్వీకరించారు. ఊరట లభిస్తుందనే నమ్మకంతో వచ్చిన అర్జీదారుల సమస్యలను ఓర్పుతో, నేర్పుతో వింటూ వారి ఆవేదనకు అభయమిచ్చారు.
తాత్సారానికి తావులేదు – అధికారులకు కఠిన ఆదేశాలు : వచ్చిన అర్జీలను ఏదో పైపైన చూసి పక్కన పడేసే పాత పద్ధతికి భిన్నంగా, ప్రతి అర్జీని మంత్రి సీతక్క క్షుణ్ణంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటూ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో వేదిక నుంచే ఫోన్లలో నేరుగా మాట్లాడి సమీక్షించారు. పెండింగ్లో ఉన్న సమస్యలపై నీళ్లు నమలకుండా, జాప్యం లేకుండా తక్షణమే చర్యలు చేపట్టి పరిష్కరించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.
స్పష్టమైన కార్యాచరణ… నిరంతర పర్యవేక్షణ : కేవలం ప్రజల బాధలు వినడమే కాకుండా, వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ప్రతి వినతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని, బాధితుడికి సమస్య పరిష్కారానికి సంబంధించిన సమాచారాన్ని పారదర్శకంగా అందించాలని సూచించారు. ప్రస్తుత ప్రజా పాలనలో ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతి అధికారీ చిత్తశుద్ధితో వ్యవహరించి, ప్రభుత్వ లక్ష్య సాధనలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.

