Anirudh Reddy political counters: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా కాంగ్రెస్ నేతలు కత్తులు దూస్తున్నారు. పక్క రాష్ట్రాల నాయకులు తెలంగాణపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భాష, ప్రాంతం, ప్యాకేజీ అంటూ సూటి పోటి మాటలతో రాజకీయ కాక రేపుతున్నారు.
ప్యాకేజీ రాజకీయాలు.. గుజరాత్లో పోటీకి సవాల్
పవన్ కళ్యాణ్ అహంకారి అని, తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే తెలంగాణలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో “ప్యాకేజీ” మాట్లాడుకుని, ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ అంటేనే ప్యాకేజీ స్టార్ అని విమర్శిస్తూ, ఏపీలో తన మిత్రపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్లకు పరోక్షంగా మద్దతు పలుకుతూ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో ఇన్ని విమర్శలు చేసే బదులు, “నువ్వు కూడా గుజరాత్లో వెళ్లి పోటీ చెయ్యి పవన్ కళ్యాణ్, నిన్ను అక్కడికి వెళ్లొద్దని ఎవరు వద్దన్నారు?” అంటూ అనిరుధ్ రెడ్డి సవాల్ విసిరారు. పవన్ ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసమే ఇంగ్లీషులో ప్రసంగాలు దంచుతున్నారని, ఆయన మాటల వెనుక ఉన్న అసలు రంగు అందరికీ తెలుసని చురకలంటించారు.
కోనసీమ కొబ్బరిచెట్లు – కొండగట్టు డప్పు
గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను అనిరుధ్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. “కోనసీమలోని కొబ్బరి చెట్లు తెలంగాణ నాయకుల దిష్టి వల్లే కాలిపోయాయని అవమానించింది నువ్వు కాదా?” అని సూటిగా నిలదీశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను పదేపదే దెబ్బతీస్తున్న పవన్, ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి టీటీడీ ద్వారా డబ్బులిప్పించామని డప్పు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. “కొండగట్టుకు మీరు పైసలు ఇస్తే గొప్పా.. తెలంగాణ నుంచి లక్షలాది మంది భక్తులు వెళ్లి ఏటా తిరుపతి శ్రీవారికి కోట్లాది రూపాయల కానుకలు సమర్పించడం లేదా?” అని ఆయన ప్రశ్నించారు.
Also Read: https://teluguprabha.net/telangana/tgpsc-notification-for-filling-290-jobs/
ఏపీలో మారనున్న సర్కార్.. జన్వాడ చెరువుపై హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై కూడా అనిరుధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారడం ఒక ఆనవాయితీ అని, వచ్చే ఎన్నికల్లో అక్కడ మళ్లీ కచ్చితంగా ప్రభుత్వం మారుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక తెలంగాణలో పవన్ కళ్యాణ్కు ఉన్న ఆస్తుల వ్యవహారాన్ని సైతం ఆయన వదల్లేదు. పవన్ కళ్యాణ్కు చెందిన జన్వాడ భూమి దగ్గర ఒక చెరువు ఉందని, చట్టానికి ఎవరూ అతీతులు కారని, అవసరమైతే ఆ చెరువు ఆక్రమణల ముచ్చట కూడా బయటకు తీయాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు.

