Kadiyam Srihari Comments: తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఒకవేళ తనపై ఉన్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే వెంటనే పదవికి రాజీనామా చేస్తానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చిన్న తప్పు కూడా చేయలేదని పేర్కొన్నారు. అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ కేవలం కల్వకుంట్ల కుటుంబానికే పరిమితమైందని తీవ్రంగా ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబం వేల కోట్లు సంపాదించిందని.. కానీ తెలంగాణ ప్రజలపై మాత్రం అప్పుల భారం వేశారని విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అప్రజాస్వామిక పద్ధతులు నచ్చకే తాను ఆ పార్టీని వీడి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయన స్పందించారు.
‘తెలంగాణ రాష్ట్రం ప్రజా సమాఖ్య పోరాటాలు, సకల జనుల సమ్మె, అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడింది. కానీ ఆ ఫలితం ఒక్క కుటుంబానికి మాత్రమే పరిమితమైంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం ఒక్కటే లాభపడింది. ఆ కుటుంబం వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు, ఫామ్హౌజ్లు సంపాదించింది. కానీ, అప్పులు మాత్రం ప్రజల మీద మోపారు. గతంలో పనిచేయని వారు, తప్పులు చేసి ఎమ్మెల్యే పదవికి తలవంపులు తెచ్చిన వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ అవినీతి, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలు నచ్చకే.. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నా. నేనెప్పుడూ చిన్న తప్పు కూడా చేయలేదు. ప్రజల గౌరవాన్ని కాపాడే విధంగా పనిచేస్తా. నా నిజాయతీనే నన్ను రాజకీయంగా నిలబెట్టింది.’- కడియం శ్రీహరి

