Alampur MLA: అలంపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ.. భౌతిక దాడికి దిగడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ ఘటన కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు ఇది పరాకాష్ట అని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఇదే అంశంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడిగా పేర్కొన్నారు.
కాంగ్రెస్ దిగజారుడు తనానికి నిదర్శనం: ప్రజల ద్వారా ఎన్నికైన ఒక ఎమ్మెల్యేపై శారీరక దాడికి దిగడం ద్వారా కాంగ్రెస్కు రాజ్యాంగం, చట్టంపై గౌరవం లేదని మరోసారి నిరూపితమైందని కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యేను అవమానిస్తూ.. శారీరక దాడికి దిగడం కాంగ్రెస్ దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. ప్రతిపక్ష నేతలను భయపెట్టి, వారి గొంతు నొక్కేందుకే కాంగ్రెస్ నేతలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే విజయుడిని అవమానించిన ఎంపీ మల్లు రవి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Also read-Davos: సీఎం ఆహ్వానం.. ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన చిరంజీవి
సీఎం నైతిక బాధ్యత: ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని కేటీఆర్ అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు.. ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పుతో ఎదుర్కోవాలని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే గట్టిగా బుద్ధి చెబుతామని కేటీఆర్ హెచ్చరించారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష గొంతును అణచివేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీఆర్ఎస్ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది.

