TG Municipal Elections: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగుతోంది. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో 7 కార్పొరేషన్లకు గాను 3 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా.. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుత ఫలితాల ప్రకారం కాంగ్రెస్.. మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో ఘన విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేషన్ను సీపీఐ కైవసం చేసుకుంది.
Also Read: https://teluguprabha.net/telangana/congress-won-90-seats-in-municipality-elections/
నల్గొండ కార్పొరేషన్లో మొత్తం 48 డివిజన్లకు కాంగ్రెస్ 27 స్థానాల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 9 డివిజన్లు, బీజేపీ 4, AIFB 4, మజ్లిస్ 2, ఇండిపెండెంట్ అభ్యర్థులు- 2 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో నల్గొండ మేయర్ పదవి కాంగ్రెస్ను వరించింది.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 60 స్థానాలకు గాను కాంగ్రెస్ 44 డివిజన్లు గెలిచి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. బీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందాయి.
రామగుండం నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పాగా వేసింది. 60 డివిజన్లకు గాను 38 స్థానాలు కైవసం చేసుకున్న హస్తం.. మేయర్ పీఠంపై కూర్చోనుంది. ఇక బీఆర్ఎస్ 13, బీజేపీ ఒక డివిజన్లోనే గెలుపొందగా.. ఇతురులు 8 డివిజన్లలో విజయబావుటా ఎగురవేశారు.
ఇక, కొత్తగూడెం కార్పొరేష్న్లో సీపీఐ సత్తా చాటింది. 47 స్థానాలకు గాను సీపీఐ 25, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ 2 డివిజన్లలో విజయం సాధించాయి.
నిజామాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్ కార్పొరేషన్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ప్రజా పాలనకు ప్రజలు పట్టం కట్టారని కొనియాడారు. ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఆదరణగా మారిందని.. కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా శ్రమించారని ప్రశంసించారు.

