BRS leader murdered: సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో పాతకక్షలు మరోసారి భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నాయకుడు, యర్కారం మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు (40) దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి పడేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కల్వర్టు వద్ద మృతదేహం: పోలీసులు మరియు స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఈ దారుణ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం తెల్లవారుజామున 3:00 గంటల ప్రాంతంలో యర్కారం గ్రామ సమీపంలోని ఒక కల్వర్టు వద్ద గోనెసంచిలో కట్టి ఉన్న మధు మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Also read-Dowry Case: నల్లగా ఉన్నావు.. అదనపు కట్నం తేవాల్సిందే!
తండ్రి హత్యకు ప్రతీకారంగానేనా?: సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ హత్య వెనుక 20 ఏళ్ల నాటి పాతకక్షలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. 2007లో మృతి చెందిన చింతలపాటి మధు తండ్రి వీరయ్య.. అప్పటి యర్కారం మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ను హత్య చేశారు. నాటి నుంచి వీరయ్యపై మిద్దె రవీందర్ కుటుంబం పగతో రగిలిపోతోంది. ఈ క్రమంలోనే రవీందర్ కుమారుడు మిద్దె జీవన్.. తన తండ్రిని చంపినందుకు ప్రతీకారంగానే వీరయ్య కుమారుడిన చంపినట్లుగా తెలుస్తోంది. పోలీసులు సైతం జీవన్పైనే ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

