New express train between Cherlapalli-Tirupati: హైదరాబాద్ నుంచి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది. చర్లపల్లి నుంచి తిరుపతి మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ కొత్త రైలు నల్గొండ-కడప మార్గంలో ప్రయాణిస్తుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. దీంతో, ఈ మార్గంలో ప్రయాణించే వారికి తిరుపతి చేరుకోవడం మరింత సులభంగా మారనుంది. కాగా, ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతికి పద్మావతి ఎక్స్ప్రెస్ నడుస్తోంది. ఈ రైలు వరంగల్ – విజయవాడ మార్గంలో ప్రయాణిస్తోంది. ఇక, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మహబూబ్ నగర్-గుత్తి మార్గంలో, నారాయణాద్రి ఎక్స్ప్రెస్, వందేభారత్ రైళ్లు నల్గొండ-గుంటూరు మార్గంలో తిరుపతికి వెళ్తున్నాయి. ఇప్పుడు, కొత్తగా ప్రవేశపెట్టిన రైలు వీటికి ప్రత్యామ్నాయ మార్గంలో అందుబాటులోకి రానుండటంతో ఆ రూట్లో ఉన్న ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త సర్వీసులు ఈ నెల 28న ప్రారంభం కానున్నాయి. కాగా, ఇప్పటి వరకు చర్లపల్లి-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు సర్వీసులను ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా కొనసాగించనున్నారు. తిరుపతి నుంచి గురువారం సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరే ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం రోడ్, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు చర్లపల్లికి చేరుకోనుంది.
Also Read: Heat Wave: బాబోయ్ ఎండలు.. తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. ఆ జిల్లాల్లో కొత్త రికార్డు..!
కొత్త మార్గంలో వీక్లీ ఎక్స్ప్రెస్..
కాగా, ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు బయలుదేరుతుంది. బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా వెళ్తూ.. శనివారం ఉదయం 7.30 గంటలకు తిరుపతికి చేరుకోనుంది. ఈ కొత్త రైలు సర్వీసులు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

