HomeతెలంగాణPermission : పవన్‌కల్యాణ్ సభకు బ్రేక్... పోలీసుల ఆంక్షలు.. కోర్టుకెక్కిన జనసేన!

Permission : పవన్‌కల్యాణ్ సభకు బ్రేక్… పోలీసుల ఆంక్షలు.. కోర్టుకెక్కిన జనసేన!

Pawan Kalyan Janasena meeting Hyderabad : తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై తమ ముద్ర వేసేందుకు సన్నద్ధమవుతున్న జనసేన పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సభకు పోలీస్ శాఖ అకస్మాత్తుగా బ్రేకులు వేసింది. ఒకపక్క ఏర్పాట్లన్నీ పూర్తయి, శ్రేణులు ఉత్సాహంగా ఉన్న తరుణంలో పోలీసుల నిర్ణయం ఆ పార్టీ నేతలకు శరాఘాతంగా మారింది. 

- Advertisement -

ఆవిర్భావ వేడుకల వేళ.. ఆంక్షల వల : జనసేన పార్టీ రేపు (జూన్ 2) హైదరాబాద్‌లోని రాయదుర్గం ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న సంధ్యా కన్వెన్షన్ వేదికగా ఒక భారీ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేసుకుంది. అయితే, సరిగ్గా రేపే తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో వీఐపీల కదలికలు, ట్రాఫిక్ ఆంక్షలు, మరియు శాంతిభద్రతల (Law and Order) నిర్వహణ దృష్ట్యా పవన్‌కల్యాణ్ సభకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వలేమని పోలీస్ శాఖ తెగేసి చెప్పింది.

పోలీసుల తీరుపై జనసేన కన్నెర్ర : పోలీసుల నిర్ణయంపై జనసేన పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీ సీనియర్ నేత మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది రోడ్ల మీద నిర్వహించే బహిరంగ సభ కాదని, కేవలం కన్వెన్షన్ హాల్ లోపల నిర్వహించుకునే అంతర్గత సమావేశం (Meeting) మాత్రమేనని స్పష్టం చేశారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం.. ఒక క్లోజ్డ్ ప్రాంగణంలో సమావేశం పెట్టుకున్నప్పుడు పోలీసులకు ముందస్తు సమాచారం (Intimation) ఇస్తే సరిపోతుందని, దీనికి ప్రత్యేకంగా అనుమతి (Permission) తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎలాంటి సరైన, సహేతుకమైన కారణాలు చూపకుండా చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం పోలీసుల ఏకపక్ష ధోరణికి అద్దం పడుతోందని మండిపడ్డారు.

కోర్టు మెట్లెక్కిన జనసైనికులు :  పోలీసుల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో, జనసేన న్యాయ విభాగం హుటాహుటిన కోర్టును ఆశ్రయించింది. సమావేశం నిర్వహించుకోవడం తమ ప్రాథమిక హక్కు అని, కేవలం శాంతిభద్రతల సాకు చూపి ఒక హాల్‌లో జరిగే మీటింగ్‌ను ఎలా అడ్డుకుంటారని పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. న్యాయస్థానం ఇచ్చే తీర్పుపైనే ఇప్పుడు పవన్‌కల్యాణ్ సభ భవితవ్యం ఆధారపడి ఉంది. కోర్టు నుంచి ఊరట లభిస్తుందా? లేక పోలీసుల వాదనతో న్యాయస్థానం ఏకీభవిస్తుందా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News