Pawan Kalyan Plans to Contest in Telangana Elections: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తుందని ప్రకటించారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి తెలంగాణలో తానే స్వయంగా పర్యటిస్తాను. ప్రతి ఊరూ తిరుగుతానని, ఇకపై తెలంగాణ రాజకీయాల్లో జనసేన చురుకైన పాత్ర పోషిస్తుందని తేల్చిచెప్పారు.
Also Read: Annamalai: తమిళనాడు బీజేపీకి బిగ్ షాక్.. అన్నామలై రాజీనామా.. అమిత్షాకు ఐదు పేజీల లేఖ
నన్ను రావొద్దనడానికి మీరెవరు?
తనను హైదరాబాద్ రావద్దంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. “తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక అంతర్భాగం. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎక్కడైనా తిరగొచ్చు. నన్ను రావద్దని అనడానికి ఎవరికీ హక్కు లేదు. గతంలో తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఎంతోమంది నాయకులు.. ఈ రోజు ఇక్కడే పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారు. అలాంటప్పుడు తెలంగాణపై ఎంతో ప్రేమ ఉన్న జనసేన ఇక్కడ ఎందుకు ఉండకూడదు.” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాజకీయ విమర్శలకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇకపై తెలంగాణలో జనసేన పార్టీ శాశ్వతంగా ఉంటుందని, ప్రజల పక్షాన నిలబడుతుందని ప్రకటించారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు ముమ్మరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ తాజా ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

