Progress in the Koti shooting case: రాష్ట్రంలో సంచలనంగా సృష్టించిన కోఠి ఎస్బీఐ బ్యాంకు వద్ద జరిగిన కాల్పుల కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. నిందితుల గాలింపు కోసం మొత్తం 5 స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ టీమ్స్ ఎట్టకేలకు నిందితులను గుర్తించాయి. నిందితుల్లో ఒకరు పాత నేరస్థుడిగా స్పెషల్ టీమ్స్ గుర్తించాయి. సెల్ఫోన్ టవర్ డంపింగ్ ద్వారా నిందితుల మొబైల్ నెంబర్ను కూడా సంపాదించారు. నిందితుల జాడ తెలుసుకునేందుకు నగర పరిధిలోని 800కు పైగా సీసీ కెమెరాను పరిశీలించనట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే, నిందితుల కోసం స్పెషల్ టీమ్స్ గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది.
అసలేం జరిగిందంటే?
కేరళ రాష్ట్రంలోని కోజికోడ్కు చెందిన రిన్షాద్ అనే 26 ఏళ్ల వస్త్ర వ్యాపారి సరుకు కొనుగోలు చేసేందుకు గానూ తన వద్ద ఉన్న రూ. 6 లక్షల నగదును డిపాజిట్ చేయడానికి శుక్రవారం ఉదయం 7 గంటలకు కోఠిలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎంకి చేరుకున్నారు. ఆయన నగదు డిపాజిట్ చేస్తున్న సమయంలోనే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి వచ్చి తుపాకీతో బెదిరించారు. రిన్షాద్ వారిని ప్రతిఘటించడంతో దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందులో ఒక బుల్లెట్ ఆయన కుడి కాలికి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అదే సమయంలో దుండగులు నగదు బ్యాగుతో పాటు ఆయన వాహనాన్ని కూడా తీసుకుని చాదర్ఘాట్ వైపు పారిపోయారు. దోపిడీ అనంతరం నిందితులు పోలీసులకు చిక్కకుండా పక్కా ప్లాన్ అమలు చేశారు. ఈ మేరకు సీసీటీవీలో రికార్డైంది. వారు బాధితుడి వాహనంపై నింబోలిఅడ్డ , కాచిగూడ ప్రాంతాలకు వెళ్లి, అక్కడ వాహనాన్ని వదిలేశారు. ఆ తర్వాత తమ ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు వెంటనే దుస్తులు మార్చుకుని, కాలినడకన కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా బయటపడింది. ఉదయం కాచిగూడ స్టేషన్ నుంచి బయలుదేరిన ఓ రైలులో వీరిద్దరూ పరారైనట్లు పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. ఈ సమాచారం ఆధారంగా రైల్వే పోలీసుల సహకారంతో నిందితుల కదలికలను ట్రాక్ చేసి ఎట్టకేలకు నిందితుల జాడ పట్టుకున్నారు. కాగా, దుండగుల దాడిలో రిన్షాద్ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు.

