Lorry Fire Accident: రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం పెంజర్ల గ్రామ పరిధిలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని శివకాశి నుంచి హైదరాబాద్కు బాణాసంచా లోడుతో వస్తున్న లారీ పెంజర్ల మీదుగా వెళ్తుండగా హై టెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి.
పెంజర్ల గ్రామ సమీపంలోని మాణిక్యమ్మగూడ వద్ద ప్రధాన రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తగలగానే లారీలోని టపాసులు పెద్ద శబ్దాలతో పేలడం ప్రారంభించాయి. దట్టమైన పొగ వందల అడుగుల ఎత్తు వరకు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తితో లారీ నుంచి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. మంటల ధాటికి లారీ పూర్తిగా ఆహుతైంది. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న కొత్తూర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. భద్రతా దృష్ట్యా పోలీసులు ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లించారు.

