Minister Konda Surekha private OSD: రాష్ట్ర అటవీ పర్యావరణం, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సురేఖ పేషీలో ప్రైవేటు ఓఎస్డీగా పని చేస్తున్న సుమంత్ను తొలగిస్తూ రాష్ట్ర కాలుష్య నియంత్రణా మండలి సభ్యకార్యదర్శి రవి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. మంత్రి సురేఖ పేషీలో ఉంటూ ఆయా శాఖల్లో నిబంధనలకు వ్యతిరేకంగా సుమంత్ చేపట్టిన కార్యకలాపాలు, అవినీతి ఆరోపణలపై ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాలు సమర్పించిన నివేదికను.. తెలుగుప్రభ దిన పత్రిక సెప్టెంబర్ 23వ తేదీన ‘సురేఖ పేషీలో సుమంతనాలు’ అనే శీర్షికన కథనం ప్రచురించింది.
ఆదేశాలు జారీ: ఈ కథనం మరుసటి రోజే ఆయా ప్రభుత్వ శాఖలలో ఓఎస్డీల నియామకాలకు సంబంధించిన విధి, విధానాలపై కేంద్ర ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ), అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది కేబినెట్(ఏసీసీ) ప్రవర్తనా నియమావళిని ప్రస్తావించింది. సిక్కిం హైకోర్టు ఈ రకమైన ఓఎస్డీల నియామకం సరికాదంటూ నొక్కి చెప్పిన తీర్పు గురించి కూడా.. కథనంలో వివరంగా ప్రచురిం చింది. ఓఎస్డీలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటుండటం, అలా పాల్గొని అధికారుల పాల్గొని అధికారుల సమీక్షా సమావేశాల్లో భాగస్వామ్యులవటం, ఐఏఎస్ స్థాయి అధికారులు మొదలు గ్రూప్ 1 స్థాయి అధికారుల వరకు నేరుగా ఫోన్లు చేసి ఆదేశాలు జారీ చేయటం వంటి పనులను సైతం సుమంత్ చేసినట్టు వచ్చిన ఆరోపణలు రుజువైనట్టు సమాచారం. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా నివేదికలు సమీక్షించిన అనంతరం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీఎస్ రామకృష్ణా రావు ఆదేశాల మేరకు పీసీబీ మెంబర్ సెక్రెటరీ సుమంత్ను తొలగించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/brs-sensational-tweet-on-state-financial-situation/
గత ఏడాదే ముగిసిన కాంట్రాక్ట్: కాంట్రాక్ట్ పద్ధతిలో కాలుష్య నియంత్రణ మండలిలో ఎన్. సుమంత్ను ఏడాది కోసం ఓఎస్డీగా నియమించారు. ఈ గడువు 16 డిసెంబర్ 2024 ముగిసింది. మరో ఏడాది(16 డిసెంబర్ 2025) వరకు పొడిగించారు. ఈక్రమంలో సుమంత్ వ్యవహార శైలిపై ఆరోపణలు వెలువడంతో కాలుష్య నియంత్రణ మండలి ఆయన నియామకాన్ని తక్షణం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సురేఖ పేషీలో డిప్యుటేషన్ మీద ఇక్కడ విధులు నిర్వహిస్తూ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ పనులతో పాటు మంత్రి వ్యక్తిగత పనులు కూడా సుమంత్ చూస్తూ వచ్చారు. వాస్తవానికి సుమంత్ పీసీబీ ఓఎస్డీగా నెలకు లక్ష రూపాయల కన్సాలిడేటెడ్ పేకు అపాయింట్ అయ్యారు. పీసీబీ ఉద్యోగిగా జీతం తీసుకుంటూనే ఏకంగా ఆ శాఖ ఉన్నతాధికారులు మీదనే పెత్తనం చేయటం గమనార్హం. ఇన్నాళ్లు సుమంత్ మంత్రికి ప్రైవేట్ ఓఎస్డీ అనుకుంటూ వచ్చిన ప్రచారానికి పీసీబీ మెంబర్ సెక్రెటరీ జారీ చేసిన తొలగింపు ఉత్తర్వులతో అసలు గుట్టు బయటపడింది. ఇప్పుడు ఇటువంటి ఓఎస్డీలు, ఈతరహా నియామకాలు ఇంకెన్ని ఉన్నాయో రేవంత్ సర్కారు లెక్కలు తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

