Telangana cabinet Meet in Yadadri: తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహణపై సీఎం రేవంత్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి యాదాద్రిలో కేబినెట్ మీటింగ్ పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కాగా, తెలంగాణ కేబినెట్ సమావేశాలన్ని ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా సరస్వతీ పుష్కరాల కారణంగా వాయిదా వేసే యోచలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 21న ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలో సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానుండగా.. ఈ ఆధ్యాత్మిక వేడుకకు రాష్ట్రంలోని మెజార్టీ మంత్రులు హాజరుకానున్నారు. మంత్రులంతా పుష్కరాల పనుల్లో నిమగ్నమవ్వడం, బాసరకు వెళ్లనుండటంతో అదే రోజు నిర్వహించాలనుకున్న కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయడమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోంది.
Also read: CM Revanth: పాలమూరు మంత్రులతో సీఎం సమావేశం.. ఆ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం..!
గతంలో మేడారంలో కేబినెట్ సమావేశం..
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీని వాయిదా వేయడమే కాకుండా, ఈసారి ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 23న ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. పాలనా వికేంద్రీకరణతో పాటు యాదాద్రి విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేలా రాజధాని హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం యోచిస్తున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా మేడారంలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి, అక్కడికక్కడే జాతర ఏర్పాట్లు, నిధులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదే తరహాలో ఇప్పుడు యాదగిరిగుట్టలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి, స్థానిక అంశాలపై కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

