CM Revanth Reddy:తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్ల మూడు నెలలు పూర్తయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై కీలక సమీక్ష నిర్వహించారు. శనివారం సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో భేటీ అయిన ఆయన, రాబోయే రెండేళ్ల తొమ్మిది నెలల కాలానికి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించారు. ప్రజలు కోరుకున్న మార్పును నిజం చేస్తూ, పారదర్శకతతో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు.
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికకు శ్రీకారం: ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ప్రణాళిక అమలు కావాలి. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక లోగోను రూపొందించాలని అధికారులకు సూచించారు. రాబోయే 99 రోజుల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్ల పరిష్కారంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.
అధికారుల పనితీరుపై సీఎం హెచ్చరిక: పాలనలో అలసత్వాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి అధికారులను హెచ్చరించారు. గత రెండేళ్లలో సాధించిన విజయాలను నిజాయతీగా అంచనా వేసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ 99 రోజుల ప్రణాళిక పురోగతిని నేనే వ్యక్తిగతంగా ప్రతిరోజూ పర్యవేక్షిస్తానని సీఎం అన్నారు. పనితీరులో లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also read-Mecca Accident: మక్కా యాత్ర బస్సు ప్రమాద ఘటన.. బాధితులకు పరిహారం అందించిన సీఎం.!
జూన్ 2 లక్ష్యంగా ప్రగతి ప్రణాళిక: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) నాటికి ప్రజలకు స్పష్టమైన ఫలితాలు అందేలా ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించాలని సీఎం కోరారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీపీజీ శివధర్రెడ్డితో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే ఈ 99 రోజుల షెడ్యూల్ను రూపొందించాలని సీఎం ఆదేశించారు.

