Telangana Government Key orders on traffic challans: తెలంగాణలో వాహనదారులకు రవాణా శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. వాహన యజమానులు ఈ-చలాన్ల కోసం నెల రోజుల్లోపు వాహన్ పోర్టల్లో తమ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. ట్రాఫిక్, మోటారు వాహన చలాన్ల ఎలక్ట్రానిక్ సేవను ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తెలంగాణలోని వాహన యజమానులు తమ మొబైల్ నంబర్లు, ఈ-మెయిల్ చిరునామాలను నెలలోగా వాహన్ పోర్టల్లో తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని వాహనదారులను ఆదేశించింది.
ఈ-పోర్టల్ ద్వారా వాహన చరిత్ర తెలిసిపోతుంది..
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2026 ప్రారంభంలో నోటిఫై చేసిన సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (సీఎంవీఆర్), 1989లోని రూల్ 167 సవరించిన నిబంధనలను అమలు చేస్తూ రవాణా శాఖ కొత్త జీవో జారీ చేసింది. అయితే, ఒక నెలలోగా వాహనదారులు తమ వివరాలను వాహన్ పోర్టల్లో అప్డేట్ చేసుకోలేకపోతే అధికారులు ఎలాంటి చర్య తీసుకుంటారో జీవోలో ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ చలాన్లు, రోడ్డు ట్యాక్స్లను ఈ పోర్టల్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఉంటుంది. సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుగోలు చేసే సమయంలో దాని చరిత్ర పూర్తిగా ఈ-పోర్టల్ ద్వారా తెలిసిపోతుంది. అందుకే, నెలరోజుల్లోగా వాహనదారులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరింది.

