Telangana Inter Admissions: ఇంటర్ ప్రవేశాల విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత విధానంలోనే యథావిధిగా అడ్మిషన్లు కొనసాగించనున్నట్లు తెలిపింది. పాఠశాల విద్యలో ఇంటర్ను విలీనం చేసే అంశంపై అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్షించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండటంతో ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రవేశాలు యథావిథిగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఇంటర్ను రద్దు చేసి సీబీఎస్ఈలో మాదిరి 11, 12 తరగతులు నిర్వహించాలని, ఫలితంగా డ్రాపౌవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రభుత్వానికి ఇటీవల సూచించిన విషయం తెలిసిందే.
మెజారిటీ రాష్ట్రాల్లో సీబీఎస్ఈ విధానం అమలు..
సీబీఎస్ఈతో పాటు ఎక్కువ రాష్ట్రాలు 11, 12 తరగతుల విధానాన్ని అనుసరిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం ఇంటర్ విద్య వేరుగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ వరకు చదివిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆ తర్వాత ఇంటర్కు వేరుగా ఉన్న కళాశాలల్లో చేరడం లేదని గతంలో ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇంటర్ను వేరుగా కాకుండా 11, 12 తరగతులుగా కొనసాగించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ఇదే అంశాన్ని ఇటీవల తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఈ నెల 4న ఇంటర్ ప్రవేశాల కోసం ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసి, మరుసటి రోజే రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది.
Also Read: https://teluguprabha.net/top-stories/pm-modi-congratulates-tamil-nadu-cm-vijay/
తల్లిదండ్రుల ఆందోళనతో వెనక్కి తగ్గిన సర్కారు..
అయితే, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీంతో, ఎంపీ వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్రెడ్డి, విద్యా శాఖ కమిషనర్ యోగితా రాణాతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇంటర్ను పాఠశాల విద్యలో విలీనం చేయడంతో ముడిపడిన పలు సాంకేతిక సాంతికేక సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. దీనిపై శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది యథావిధిగా ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది.

