Telangana key decision More safety for women: మహిళా ప్రయాణికుల రక్షణను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు ప్రయాణాల్లో మహిళలకు అత్యంత సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు ‘బస్సులో భరోసా’ అనే సరికొత్త అత్యాధునిక భద్రతా వ్యవస్థను టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన సాంకేతికత ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరి కదలికలను క్షుణ్ణంగా పర్యవేక్షించే అవకాశం లభించనుంది. అయితే, పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటి విడతలో భాగంగా ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని 175 బస్సుల్లో ఈ అత్యాధునిక సీసీటీవీ కెమెరాల వ్యవస్థను అధికారులు విజయవంతంగా అమర్చారు. బస్సు ఫుట్బోర్డ్ నుంచి మొదలుకొని ఆఖరి సీటు వరకు బస్సు లోపల ఉన్న ప్రతి అంగుళాన్ని ఈ సీసీ కెమెరాలు అత్యంత స్పష్టంగా రికార్డ్ చేయగలవు.
Also read: Balakrishna: పరిశ్రమ బాగుండాలంటే ఎక్కువ సినిమాలు రావాలి.. నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
బస్సుల్లో ఈవ్ టీజింగ్కు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా.
బస్సుల్లో రికార్డ్ అయ్యే విజువల్స్ కేవలం స్టోరేజ్కే పరిమితం కావు. నేరుగా ఆర్టీసీ కేంద్ర కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తారు. అక్కడ ప్రత్యేక భద్రతా సిబ్బంది 24 గంటలూ ఈ లైవ్ ఫుటేజ్ను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. బస్సుల్లో మహిళా ప్రయాణికుల పట్ల జరిగే అసభ్య ప్రవర్తన, ఈవింగ్ టీజింగ్ వంటి చర్యలకు ఈ నిఘా వ్యవస్థతో పూర్తిగా బ్రేక్ పడనుంది. రద్దీగా ఉండే బస్సులను ఆసరాగా చేసుకుని జరిగే జేబు దొంగతనాలు, బంగారు గొలుసుల అపహరణ వంటి నేరాలను తక్షణమే గుర్తించి నిందితులను పట్టుకోవచ్చు. ప్రయాణికులతో బస్సు కండక్టర్ లేదా డ్రైవర్లు దురుసుగా ప్రవర్తించినా, లేదా ప్రయాణికులే సిబ్బందిపై గొడవకు దిగినా బాధ్యులెవరో కంట్రోల్ రూమ్ విజువల్స్ ద్వారా స్పష్టంగా తేలిపోతుంది.టీజీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన ఈ ‘బస్సులో భరోసా’ డిజిటల్ నిఘా రక్షణ వలయం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల బస్సులకు ఈ వ్యవస్థను విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు.

