Telangana Registrations: తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ భూ రిజిస్ట్రేషన్ల పని వేళలు పొడిగిస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31తో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని పని వేళలను పొడిగించింది. ఈ మేరకు ఈ నెల 28, 30, 31 తేదీల్లో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నాయి.
రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సాంకేతిక లోపాల వల్ల కలిగిన అంతరాయం దృష్ట్యా, రిజిస్ట్రేషన్ల శాఖ మార్చి 31 వరకు పని వేళలను పొడిగించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీని తగ్గించడానికి, స్లాట్ బుకింగ్ సమయాలను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, మార్చి 24 నుంచి సర్వర్ల సమస్యతో స్లాట్ బుకింగ్లు, చలాన్ల చెల్లింపులు ఆగిపోయిన విషయం తెలిసిందే. సర్వర్లు మొరాయించడం, సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పని వేళలను పొడిగించింది. వినియోగదారులు ఈ మార్పును గమనించి, తమ రిజిస్ట్రేషన్ పనులను పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

