Telangana Politicians Fire on MP Tejasvi Surya Comments: తెలంగాణ ఏర్పాటును భారత్- పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రాజకీయ నేతలు మండిపడుతున్నారు. తేజస్వీ సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై గురువారం జరిగిన చర్చలో భాగంగా ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ అలజడి సృష్టిస్తున్నాయి. బ్రిటీష్ వాళ్లు భారత్- పాకిస్థాన్ను విడదీసినట్లుగా కాంగ్రెస్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ను విడదీసిందని ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలపై సైతం ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తూ పలు విమర్శలు చేశారు. దీంతో సూర్య ప్రసంగంపై తెలంగాణ రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడే హక్కు సూర్యకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటమని.. వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితమని పేర్కొన్నారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చడం ద్వారా బీజేపీ తెలంగాణ పట్ల తన వ్యతిరేక వైఖరిని మరోసారి బయటపెట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా, పార్లమెంట్ ఆమోదంతో ఏర్పడిన తెలంగాణను పాకిస్థాన్ విభజనతో పోల్చడం దుర్మార్గమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితమని వెల్లడించారు.

