Municipal Elections Gift Return:తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో అనూహ్య సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఒకటో వార్డు పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ తరఫున…
ఈ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వరూపరాణి పోటీ చేశారు. ఎన్నికల ఫలితాల్లో ఆమె పరాజయం పాలయ్యారు. ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో పంపిణీ చేసిన బహుమతులను ఓటర్లు తిరిగి తీసుకొచ్చి వీధిలో ఉంచడం అక్కడి పరిస్థితిని మరింత చర్చకు దారి తీసింది.
Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/tomorrow-bioasia-summit-2026-to-begin-in-hyderabad/
చీరలు, హాట్ బాక్స్లు, కుక్కర్లు..
స్థానికుల ప్రకారం, ఎన్నికల ప్రచార సమయంలో చీరలు, హాట్ బాక్స్లు, కుక్కర్లు వంటి వస్తువులు పంచినట్లు చెబుతున్నారు. అయితే ఫలితాల అనంతరం కొన్ని ఇళ్లకు వెళ్లి ఆ బహుమతులను తిరిగి ఇవ్వాలని స్వరూపరాణి అనుచరులు కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి నిరసనగా ఓటర్లు తామందుకున్న వస్తువులను రోడ్డుపై పెట్టి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
గ్లాస్ సీసాలు విసిరినట్లు..
స్వరూపరాణి అనుచరులు, బంధువులు ఓటు వేయలేదనే కారణంతో ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారని కొన్ని కుటుంబాలు ఆరోపించాయి. శనివారం రాత్రి కొంతమంది ఇళ్లపై గ్లాస్ సీసాలు విసిరినట్లు, దుర్భాషలాడినట్లు స్థానికులు చెబుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ బాధితులు భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/telangana-to-launch-organic-farming-app-for-farmers/
ఇక మరోవైపు స్వరూపరాణి ఈ ఆరోపణలను ఖండించారు. తాను ఓటర్లకు ఎలాంటి హాట్ బాక్స్లు, కుక్కర్లు, చీరలు పంపిణీ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. దాడుల సంఘటనలకు తనకు సంబంధం లేదని తెలిపారు.
సోషల్ మీడియాలో విస్తృతంగా..
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఓడిన అభ్యర్థుల అనుచరుల ప్రవర్తనపై వివిధ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఓడిన అభ్యర్థులు ఎన్నికల సమయంలో ఇచ్చిన డబ్బు లేదా బహుమతులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది.

