Inter Board First Year Practicals: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా విధానంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక సంస్కరణలు ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో స్కిల్స్ను పెంచేందుకు ఇప్పటివరకు కేవలం సెకండ్ ఇయర్లో మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. అయితే ఈ విధానాన్ని ఇకపై ఫస్ట్ ఇయర్లోనూ అమలు చేయాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షా సరళిని, మార్కుల కేటాయింపును సవరించింది. ఈ నూతన విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుందని తెలిపింది.
Also Read: https://teluguprabha.net/national-news/cm-vijay-good-news-to-government-employes/
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ కోర్సులకు ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్ ఉంటాయని ఇంటర్ బోర్డు తెలిపింది. ఫస్ట్ ఇయర్లో 15 మార్కులు, సెకండ్ ఇయర్లో 15 మార్కుల చొప్పున ఒక్కో సబ్జెక్టుకు మొత్తం 30 మార్కులను ప్రాక్టికల్స్కు కేటాయిస్తారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేలా ప్రయోగపూర్వక విద్యను మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకువస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
ఇక మ్యాథ్స్లోనూ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ను ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది. ఈ మేరకు మ్యాథ్స్లో 75 మార్కులకు బదులు 60 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్నల్ అసెస్మెంట్కు ఒక్కో ఏడాదికి 15 మార్కులు కేటాయించనున్నారు.
మరోవైపు హ్యూమానిటీస్(కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ)లో యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్కు 20 మార్కులు కేటాయించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. దీంతో ఫైనల్ పరీక్షలు 100 మార్కులకు బదులు 80 మార్కులకు నిర్వహించనున్నారు. భాషా విభాగాల్లో ఫైనల్ పరీక్షల్లో 100 మార్కులకు బదులు 80 మార్కులు, మిగతా 20 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్కి కేటాయించనున్నారు. MEC విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 80 మార్కుల థియరీ, 20 మార్కులను ఇంటర్నల్స్కి కేటాయించనున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా.. ఇంటర్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అడ్మిషన్లను యథావిధిగా పాత పద్ధతిలోనే చేపట్టాలని ప్రభుత్వం భావించింది.

