The third phase of the campaign has ended in Local body Elections: తెలంగాణ పల్లెల్లో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికల పూర్తవ్వగా.. తుది లేదా మూడో విడత ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఎల్లుండి (బుధవారం) జరగనున్న మూడో విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రంతో ముగిసింది. మూడో విడత పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 17న (బుధవారం) 182 మండలాలు, 4,157 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. తుది విడతలో 53,06,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 26,01,861 మంది పురుష ఓటర్లు, 27,04,394 మంది మహిళా ఓటర్లు, 146 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఈ పోలింగ్ ప్రక్రియ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36,483 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, మూడో విడతలో మొత్తం 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని, ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి (బుధవారం) సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ కొనసాగుతుండగా.. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. అంతేకాకుండా, కొన్ని కొన్ని చోట్ల ఓట్లు సమానంగా రావడంతో అభ్యర్థులు చివరకు టాస్తో విజయం సాధిస్తున్నారు. ఒక్కోచోట, ఒక్క ఓటుతో విజయం సాధించిన వారూ ఉన్నాయి.
రెండో విడతలో కాంగ్రెస్ హవా..
రెండో విడతలో అత్యధిక పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా విజయం సాధించారు. ఈ విడతలో మొత్తం 4,331 పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల కాగా, 415 పంచాయతీల్లో సర్పంచ్, అలాగే 8,307 వార్డుస్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 3,911 సర్పంచ్, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది, వార్డుమెంబర్ల కోసం 71,071 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగగా.. మొత్తం 4,331 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ పార్టీ 2,316 స్థానాలను కైవసం చేసుకొని తన ఆధిపత్యాన్ని చాటుకున్నది. బీఆర్ఎస్ పార్టీ 1,157 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 256, ఇతరులు 481 స్థానాలు సాధించారు. తొలి రెండు విడతల్లో అధికార కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్ తో ఉన్నారు.

