Bogatha Waterfalls: ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరగా పేరుగాంచిన బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. జలపాతం ముందు ఏర్పాటు చేసిన సెల్ఫీ వ్యూ పాయింట్ను దాటి, స్విమ్మింగ్ పూల్ ప్రాంతం మీదుగా నీరు ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
సందర్శనకు నో అనుమతి
పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ అధికారులు గురువారం మధ్యాహ్నం నుంచి బొగత జలపాతం సందర్శనకు తాత్కాలికంగా అనుమతులు నిలిపివేశారు. నీటి ప్రవాహం తగ్గే వరకు సందర్శకులను అనుమతించబోమని అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసి లోపలికి వెళ్లిన తమను కొద్దిసేపటికే బయటకు పంపించారని, టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా అధికారులు స్పందించలేదని కొందరు పర్యాటకులు ఆరోపించారు.
Also Read: CJP Protest: మళ్లీ ఉద్యమం దిశగా సీజేపీ.. జంతర్ మంతర్ వద్ద భారీ భద్రత
అధికారుల నిరంతర పర్యవేక్షణ
ఈ ఆరోపణలపై ఇన్చార్జి రేంజ్ అధికారి నరేందర్ స్పందిస్తూ.. పర్యాటకుల ఆరోపణల్లో నిజం లేదన్నారు. జలపాతాన్ని వీక్షించిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రతా కారణాలతో మాత్రమే సందర్శకులను బయటకు పంపించినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జలపాతం వద్ద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వాతావరణ పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

