Bandi Bhagirath POCSO: పోక్సో కేసు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు మహిళా న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అనుచిత ఆరోపణలు చేసినందుకు గాను చార్మినార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ బీఎస్. చిరంజీవి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
Also Read: https://teluguprabha.net/technology-news/ai-threatens-entry-level-jobs/
బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మాధవి దేవిని లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ విస్తృతమయ్యాయి. భగీరథ్కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, అందుకు ప్రతిఫలంగా జడ్జి భర్తకు ‘బార్ కౌన్సిల్ ఛైర్మన్’ పదవి ఇస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఇలాంటి నిరాధారమైన పోస్టుల వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతుందని హైకోర్టు రిజిస్ట్రార్ చార్మినార్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదు చేశారు.
హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో, చార్మినార్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సదరు అనుచిత పోస్టులను పెట్టిన సోషల్ మీడియా ఐడీలను, నిందితులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/kishan-reddy-comments-on-grain-procurement/
ఇదిలా ఉండగా.. శనివారం రాత్రి పేట్ బషీరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్ను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.

