State financial condition: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీల అమలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందనికిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
హామీల అమలుపై విమర్శల బాణాలు: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కిషన్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. 6 గ్యారెంటీలతో పాటు మొత్తం 420 హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలం అయ్యిందని తెలిపారు. అధికారం చేపట్టాక ఖజానాలో నిధులు లేవని.. లంకెబిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలు ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ హామీల నుండి ప్రభుత్వం వెనక్కి తగ్గుతోందని మండిపడ్డారు.
ఖజానా నిల్.. నేతల జేబులు ఫుల్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న తరచూ చేస్తున్న వ్యాఖ్యల్లో వైరుధ్యం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఓ వైపు ఖజానా ఖాళీ అని చెబుతూనే.. మరోవైపు సోనియా, రాహుల్ గాంధీ కుటుంబాల కోసం రూ. 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. దీన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నేతల జేబులు ఫుల్ అన్నట్లుగా తెలంగాణ పరిస్థితి తయారైందని ఏద్దేవా చేశారు.
Also read-Rahul Gandhi: ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధమే.. రేవంత్ విజ్ఞప్తికి రాహుల్ గాంధీ రిప్లై.!
అప్పులపై ఆగ్రహం: రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని వివరిస్తూనే గత, ప్రస్తుత ప్రభుత్వాల తీరును కిషన్ రెడ్డి తప్పుబట్టారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పాలనలో తెలంగాణను అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ఆర్థిక వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందుకే వెంటనే శ్వేతపత్రం ద్వారా అన్ని వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

