V HanumanthaRao on RajyaSabha Seat: తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఎంపీ స్థానంపై టీపీసీసీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆశలు పెట్టుకున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పని చేస్తున్నానని.. తన పనితీరు చూసి సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా అవకాశం ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో పనిచేసే వారికి పదవులు దక్కుతాయని రేవంత్ రెడ్డి అన్నారని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలో త్వరలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా.. వాటి కోసం పలువురు రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు టీపీసీసీని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తనకు రాజ్యసభ అవకాశం కల్పించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ అధిష్ఠానంపైన పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మాట్లాడారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/mukunda-jewellers-first-ever-outlet-in-visakhapatnam/
‘పార్టీలో పని చేసిన వారికే పదవులు దక్కుతాయని ఇటీవల వికారాబాద్లో జరిగిన డీసీసీ శిక్షణా తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈరోజు వరకు పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నా. అందుకే రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. పార్టీలో నా పనితీరును చూసి రేవంత్ రెడ్డి తప్పకుండా అవకాశం ఇవ్వాలి. పార్టీ కోసం నా పోరాట సామర్థ్యాలను చూసి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అందరికంటే ఎక్కువగా నామీదే కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ నేను భయపడటం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక సిపాయిగా, గాంధీ కుటుంబానికి విధేయుడిగా పనిచేస్తున్నా.’ అని వీహెచ్ పేర్కొన్నారు.
తనకు రాజ్యసభ అవకాశంపై పలువురు కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారని వీహెచ్ అన్నారు. తనకు ఫోన్లు చేసే వారికి ఒక విషయం చెప్పదలుచుకున్నానని, మన పని మనం చేసుకుంటూ వెళదామని సూచించారు. ఫలితం అధిష్ఠానానికి వదిలివేద్దామని.. జీవితంలో ఎవరికీ అన్యాయం చేయని తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు రెండుసార్లు అన్యాయం జరిగినా పార్టీ జెండా మోస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు.
తనకు అవకాశం ఇవ్వాలని మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు తెలిపారు. అవకాశం ఇవ్వాలని సోనియా గాంధీకి కూడా లేఖ రాసినట్లు తెలిపారు. గడిచిన పదేళ్లలో తనకు ఎలాంటి పదవి లేదని అన్నారు. ఈసారి ఈ బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు జాతీయ రాజకీయాల్లో చాలా పరిచయాలు ఉన్నాయని తెలిపారు. తాను ఢిల్లీలో ఉంటే మిగతా పార్టీలు, రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు.

