Jangaon- Thorrur: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నడుమ జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల భవితవ్యం తేలింది. రెండు మున్సిపాలిటీలకూ లాటరీ తీయగా.. రెండిట్లోనూ కాంగ్రెస్నే అదృష్టం వరించింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
పలు కారణాల్ల 11 మున్సిపాలిటీల ఛైర్మన్లు, వైస్ఛైర్మన్ల ఎన్నిక నిన్న వాయిదా పడిన విషయం తెలిసిందే. వాటిలో జనగామ, తొర్రూర్ మున్సిపాలటీలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రెండూ పురపాలికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్.. సమాన స్థానాలు గెలుచుకుని ఆధిక్యంలో ఉన్నాయి.
జనగామలో 30 వార్డులుండగా.. బీఆర్ఎస్ 13 చోట్ల గెలుపొందగా.. కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఎం(1)తో కలిసి 13 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఈ క్రమంలో సోమవారం మున్సిపాలిటీల వద్ద పలు ఉద్రిక్తతల కారణంగా ఎన్నిక వాయిదా పడింది. ఈ రోజు ఎన్నిక నిర్వహించగా.. బీఆర్ఎస్కు ఇద్దరు స్వతంత్రులు మద్దతు తెలిపారు. ఇంకా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు హక్కును వినియోగించారు. దీంతో ఆ పార్టీ బలం 16కి చేరింది.
మరోవైపు కాంగ్రెస్కు ఇద్దరు స్వతంత్రులు మద్దతు తెలిపారు. భువనగిరి ఎంపీ కిరణ్కుమార్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు హక్కును వినియోగించుకోవడంతో.. కాంగ్రెస్కూ సంఖ్యాబలం 16 కి పెరిగింది. దీంతో ఇరు పార్టీలూ సమాన స్థానాలు సాధించడంతో చివరి ఆప్షన్గా లాటరీ తీశారు. లాటరీలో కాంగ్రెస్కు చెందిన ఛైర్మన్ అభ్యర్థి పేరు రావడంతో మున్సిపాలిటీ హస్తగతమైంది.
Also Read: https://teluguprabha.net/top-stories/cm-revanth-reddy-participates-in-bio-asia-2026-conference/
ఇక, తొర్రూర్లో మొత్తం 16 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాలు గెలుచుకున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9 కి చేరింది. దీంతో లాటరీ తీయగా.. ఇక్కడా కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థి పేరు రావడంతో విజయం అధికార పార్టీనే వరించినట్లయింది.

