Errabelli Dayakar Rao: మున్సిపల్ ఎన్నికల్లో తెగించి పనిచేసిన కార్యకర్తలకు తానేం సమాధానం చెప్పుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉద్రిక్తత నేపథ్యంలో దయాకర్ రావును పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పని చేస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తానేం సమాధానం చెప్పాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో దయాకర్ రావును నర్సింహుల పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలిస్తుండగా.. ఈ వ్యాఖ్యలు చేశారు.
ఛైర్మన్ ఎన్నిక తీరును తప్పుబట్టిన ఎర్రబెల్లి.. తన జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ప్రజలు తమకు పట్టం కడితే ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించి ఛైర్మన్ పదవిని లాక్కుందని విచారం వ్యక్తం చేశారు. తనను, తన భార్యను ఎందుకు అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా ముగిశాయి. మొత్తం 16 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాలు గెలుచుకున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9 కి చేరింది. దీంతో లాటరీ తీయగా.. ఇక్కడా కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థి పేరు రావడంతో విజయం అధికార పార్టీనే వరించింది. దీంతో మున్సిపల్ ఛైర్మన్ పదవి చేజారిపోవడంతో ఎర్రబెల్లి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
రేవంత్ రెడ్డి అరాచకాలకు కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో నర్సింహులపేట పోలీస్ స్టేషన్ కు తరలింపు.
కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలి.. రాజ్యాంగానికి విరుద్ధంగా పని చేశారంటు ఆగ్రహం. pic.twitter.com/QYdpnQU9aX
— K K (@KiranKCR) February 17, 2026

