Raghunathapalli: జనగామ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు: రఘునాథపల్లి మండలంలోని గోవర్ధన్ గిరి దర్గా సమీపంలో ఓ ఎర్టిగా కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుండి హనుమకొండ వైపు వెళ్తున్న కారు తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు గోవర్ధన్ గిరి దర్గా వద్ద అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో హనుమకొండ నయీమ్ నగర్కు చెందిన హబీబ్ హఫ్సా (27), అసదుద్దీన్ (26) తీవ్ర గాయాలై స్పాట్లోనే మరణించారు. కారులోని మిగిలిన నలుగురికి సైతం గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
అతివేగమే ప్రధాన కారణం: సమాచారం అందుకున్న రఘునాథపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

