Patalganga: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాయగఢ్ జిల్లాలోని ‘పాతాళగంగ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్’లోకి వరద నీరు భారీగా వచ్చింద. దీంతో ప్లాంట్లో నిల్వ ఉంచిన 3,000 గ్యాస్ సిలిండర్లు వరద తాకిడికి పాతాళగంగ(Patalganga) నదిలోకి కొట్టుకుపోయాయి. సిలిండర్లు(Gas cylinders) వరదలో కొట్టుకుపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కీలక ఆదేశాలు జారీ చేసిన రాయగఢ్ కలెక్టర్: నది ఒడ్డుకు కొట్టుకొచ్చే సిలిండర్లను ఎవరూ ఇళ్లకు తీసుకెళ్లవద్దని రాయగఢ్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. “నదిలోకి కొట్టుకొచ్చిన సిలిండర్లలో గ్యాస్ ఉందో లేదో తెలియదు. అవి ఎంతవరకు సురక్షితమైన స్థితిలో ఉన్నాయో చెప్పలేం. వాటిని తాకడం లేదా ఇళ్లకు తీసుకెళ్లడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది” అని కలెక్టర్ స్పష్టం చేశారు. నది ఒడ్డున ఎక్కడైనా సిలిండర్లు కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని జిల్లా యంత్రాంగం కోరింది. కొట్టుకుపోయిన సిలిండర్లను గుర్తించి వాటిని సురక్షితంగా స్వాధీనం చేసుకునేందుకు ప్లాంట్ యాజమాన్యంతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజలు ఎవరూ ఆ సిలిండర్ల దరిదాపుల్లోకి వెళ్లవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సిలిండర్లు నదిలోకి కొట్టుకుపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

