Water Board GM Kumar: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ చేతికి చిక్కిన హైదరాబాద్ జలమండలి జీఎం అనంత లక్ష్మికుమార్ను అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు లక్ష్మీకుమార్ను చంచల్గూడ జైలుకు తరలించారు.
8 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ రైడ్స్: హైదరాబాద్ జలమండలిలో ప్రాజెక్టు డివిజన్-3 జీఎంగా పనిచేస్తున్న లక్ష్మి కుమార్ (58) భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ రంగంలోకి దిగింది. మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకే ఏసీబీ హైదరాబాద్ సీఐయూ విభాగం డీఎస్పీ మాజిద్ఖాన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం సోదాలు ప్రారంభించింది. కుమార్తో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన 8 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు నిర్వహించారు.
Also read- ACB Raids: జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు
మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే!: సోదాల సందర్భంగా జీఎం ఇంట్లో రూ.500 నోట్ల కట్టలు భారీగా దర్శనమిచ్చాయి. నోట్లు భారీగా ఉండటంతో వాటిని లెక్కించడానికి అధికారులు ఏకంగా నోట్ల లెక్కింపు యంత్రాన్ని తెప్పించారు. ఏసీబీ ప్రాథమిక అంచనా ప్రకారం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ దాదాపు రూ.5.88 కోట్లుగా తేలింది. అయితే బహిరంగ మార్కెట్లో వీటి అసలు విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.

