AP Cabinet meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో జరిగే ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు ఆర్థిక క్రమశిక్షణ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా అడుగులు: ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో వ్యయ నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ కార్యక్రమాలు, మంత్రుల పర్యటనలు, భద్రతా ఏర్పాట్లలో అనవసర ఖర్చులను తగ్గించేలా కొత్త మార్గదర్శకాలపై నేటి కేబినేట్ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా డిజిటల్ పరిపాలనను ప్రోత్సహించడంలో భాగంగా కొన్ని విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అంశంపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. దీనివల్ల ఇంధన పొదుపుతో పాటు కార్యాలయ నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also read-IBOMMA: చిత్ర పరిశ్రమకు బిగ్ షాక్.. ఐ బొమ్మ మళ్లీ వచ్చింది!
సరికొత్త మార్పులకు శ్రీకారం: ప్రభుత్వ విభాగాల్లో పనితీరును మెరుగుపరచడానికి.. సాంకేతికతను జోడించడానికి చేపట్టాల్సిన సంస్కరణలపై సైతం ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూనే సంక్షేమ పథకాల అమలు మరియు రాబోయే నెలల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రాజెక్టులపై దిశానిర్దేశం చేయనున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఇప్పటికే తమ కాన్వాయ్లను తగ్గించుకుని పొదుపును ప్రారంభించగా.. నేటి కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర పరిపాలనలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయి.

