AP Deputy CM Pawan Kalyan: దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఇంధన వాడకాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు అద్భుత స్పందన లభిస్తోంది. పలు రాష్ట్రాల్లోని సీఎంలు, మంత్రులు సైతం పొదుపు చర్యల్లో భాగస్వామ్యం అవుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ కాన్వాయ్ వాహనాల సంఖ్యను 50 శాతం మేర తగ్గించుకున్నారు.
భద్రతా సిబ్బందికి కీలక ఆదేశాలు: ప్రధాని మోదీ స్ఫూర్తితో పవన్ కల్యాణ్ తన భద్రతా సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తక్షణమే సగానికి తగ్గించాలని స్పష్టం చేశారు. కేవలం అమరావతిలోనే కాకుండా.. జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు సైతం పరిమిత వాహనాలతోనే వెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక పాలకుడు విలాసాలకు పోకుండా సామాన్యుడిలా ఆలోచించడం గొప్ప విషయమని కొనియాడుతున్నారు.
అదే బాటలో ఏపీ సీఎం చంద్రబాబు: డిప్యూటీ సీఎం నిర్ణయానికి మద్దతుగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తన కాన్వాయ్లో వాహనాలను 50 శాతానికి తగ్గించుకోవాలని నిర్ణయించారు. దేశ ప్రధాని పిలుపును అందిపుచ్చుకుని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు సైతం మార్గదర్శకంగా నిలుస్తోంది .దీనివల్ల ఇంధన ఖర్చు తగ్గడమే కాకుండా.. సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

