Bhogapuram International Airport Inauguration : ఉత్తరాంధ్ర ప్రగతికి ఊపిరిపోస్తూ, విమానయాన రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఒకవైపు అత్యాధునిక సాంకేతిక సొబగులు, మరొకవైపు మన్యం కళాకారుల సంప్రదాయ కళారూపాలు కలగలిసి కన్నుల పండువగా నిలిచిన ఈ సుదినాన భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయ టెర్మినల్ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా 13,500 మంది గిరిజన మహిళలు లయబద్ధంగా చేసిన ‘ధింసా’ నృత్య రూపకం ప్రధానమంత్రితో పాటు యావత్ సభను మైమరపించి గిన్నిస్ రికార్డును సైతం తిరగరాసింది. ఆకాశాన్ని తాకే ఆశలతో ఆవిర్భవించిన ఈ విమానాశ్రయం వెనుక ఉన్న సాంకేతిక విశేషాలేమిటి? గిరిజన సంస్కృతికి పట్టాభిషేకం చేసిన ఆ నృత్య దృశ్యం వెనుక ఉన్న అద్భుతాలు ఏంటి?
వైభవంగా టెర్మినల్ ప్రారంభోత్సవం – నేతల సమక్షం : భోగాపురం విమానాశ్రయ ప్రాంగణానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితర ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ప్రధాని మోదీ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి, లోపలి అత్యాధునిక వసతులను పర్యవేక్షించారు. జిఎంఆర్ (GMR) గ్రూప్ ఛైర్మన్ గ్రాంధి మల్లికార్జునరావుతో పాటు జీఎంఆర్ ప్రతినిధులు టెర్మినల్లోని చెక్-ఇన్ హాల్స్, సెక్యూరిటీ విభాగాలు, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక వసతుల గురించి ప్రధానికి సవివరంగా వివరించారు.
ఆధునిక సాంకేతికతకు నిలయం – సంస్కృతికి ప్రతిబింబం : రూ.5,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమైన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా తీర్చిదిద్దారు. భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని 4 కోట్ల మంది ప్రయాణికులకు పెంచేలా బృహత్ ప్రణాళిక రూపొందించారు.
సాంకేతిక మెరుగులు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (BIM), ఏయిర్సైడ్ 4.0 సాంకేతికత, బయోమెట్రిక్ పాసింజర్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ వంటి అత్యుత్తమ సదుపాయాలు ఈ ఎయిర్పోర్ట్లో పొందుపరిచారు.
కళాత్మక డిజైన్: టెర్మినల్ పైకప్పు రూపకల్పనలో ఏపీ సంప్రదాయ ‘చుట్టిల్లు’ శైలిని, అరకు లోయ అందాలను ప్రతిబింబించేలా వాస్తు శైలిని తీర్చిదిద్దడం విశేషం. అంతేకాకుండా ఏటికొప్పాక బొమ్మలు, తోలుబొమ్మలాట, బొబ్బిలి వీణ నమూనాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
13,500 మంది గిరిజన కాంతల ‘ధింసా’ – గిన్నిస్ రికార్డ్ సంబరం : టెర్మినల్ పరిశీలన అనంతరం ప్రధాని మోదీ ప్రత్యేక ఓపెన్ టాప్ వాహనంలో బహిరంగ సభా ప్రాంగణానికి వెళ్లే మార్గంలో మన్యం కళాకారులు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఐటీడీఏ పరిధి నుంచి తరలివచ్చిన 13,500 మందికి పైగా గిరిజన మహిళలు, విద్యార్థినులు ఏకరూప గులాబీ చీరలు, పచ్చటి అంచులతో శోభాయమానంగా తయారై సంప్రదాయ ‘ధింసా’ నృత్యాన్ని ప్రదర్శించారు. 433 బృందాలుగా విడిపోయి, ఒకే తాళానికి లయబద్ధంగా పాదాలు కదుపుతూ చేసిన ఈ సమూహ నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నిలిచి ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతిని ప్రపంచ పటంలో నిలబెట్టింది.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘గేమ్చేంజర్’ : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం విమాన ప్రయాణాలకే పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చే తిరుగులేని ‘గేమ్ ఛేంజర్’గా నిలవనుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పరిశ్రమల స్థాపన, ఐటీ రంగ విస్తరణ, ఎగుమతుల వృద్ధి మరియు పర్యాటకరంగ వికాసానికి ఈ విమానాశ్రయం నూతన ద్వారాలను తెరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

