BJP New presidents for 4 states: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అన్ని రాష్ట్రాలపై పట్టు బిగించేందుకు ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఒకేసారి నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో పాటు హర్యానా రాష్ట్ర అధ్యక్షురాలిగా అర్చన గుప్తాను, పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కేవల్ సింగ్ ధిల్లాన్ను, త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా అభిషేక్ దేబ్నాథ్ను నియమించింది. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని పార్టీ వర్గాలు ప్రకటించాయి.
Also read: Viral Video: రెండుసార్లు ల్యాండింగ్ విఫలం.. తృటిలో తప్పిన ప్రమాదం.. కొలంబియాలో ఘటన
ఢిల్లీతో పాటు ఆయా రాష్ట్రాల్లో..
ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన హర్ష్ మల్హోత్రా ప్రస్తుతం ఢిల్లీ నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ఆయన కేంద్ర సహాయ మంత్రిగానూ సేవలు అందిస్తున్నారు. చాలా కాలంగా పార్టీ సంస్థాగత రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న మల్హోత్రా, ఢిల్లీ బీజేపీలో గతంలో ఎన్నో కీలకమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. ప్రజల్లోకి వెళ్లడం, పార్టీని బలోపేతం చేయడం, అభివృద్ధికి సంబంధించిన విషయాలపై పనిచేయడంలో ఆయన మంచి దిట్ట. ఇక, హర్యానా బీజేపీ నూతన అధ్యక్షురాలిగా డాక్టర్ అర్చన గుప్తాను నియమించింది. రాష్ట్ర పార్టీ వర్గాల్లో అందరికీ బాగా తెలిసిన ఆమె.. పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఎన్నో విభిన్నమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ముఖ్యంగా పార్టీలో మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో, మహిళలను ముందుకు నడిపించడంలో ఆమె ఎంతో కృషి చేశారు.
పార్టీ బలోపేతం కోసం మరింత కృషి..
మరోవైపు, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా కేవల్ సింగ్ ధిల్లాన్ నియమితులయ్యారు. బర్నాలా నియోజకవర్గం నుండి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2022లో జరిగిన సంగ్రూర్ లోక్సభ ఉపఎన్నికలో, అలాగే 2024లో జరిగిన బర్నాలా అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ టికెట్పై పోటీ చేశారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా ఆయన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా. కెప్టెన్ అమరీందర్ సింగ్కు ఆయన అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. బర్నాలా ప్రాంత ప్రజలు ఆయనను అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టే నాయకుడిగా భావిస్తారు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే మంచి వ్యక్తిగా ఆయనకు పేరుంది. మరోవైపు, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన అభిషేక్ దేబ్నాథ్, చాలా కాలంగా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన వివిధ రకాల ప్రచార కార్యక్రమాలలో ఆయన ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. త్రిపురలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తారని, పార్టీ పునాదులను మరింత విస్తరిస్తారని బీజేపీ అధిష్టానం ఆయనపై నమ్మకం పెట్టుకుంది. అయితే, తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోనూ త్వరలో కొత్త అధ్యక్షులను నియమించనున్నట్లు తెలుస్తోంది.

