Jagityala Sabha: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టినట్లుగా తెలుస్తుంది. వ్యూహాత్మక ఎత్తుగడలకు కేర్ ఆఫ్ అయిన కేసీఆర్.. జగిత్యాల సభలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పేరు తీయకుండానే విమర్శల బాణాలు: జగిత్యాల బహిరంగ సభ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై.. తనదైన శైలిలో విమర్శలు చేసినప్పటికీ.. ఎక్కడా రేవంత్ రెడ్డి పేరు తీయలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రసంగం మొత్తం మీద కాంగ్రెస్ నాయకులలో కేవలం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేరును మాత్రమే ఆయన ప్రస్తావించారు. గతంలో జరిగిన ఎల్కతుర్తి సభలో కూడా ఇదే ధోరణిని కనబరిచిన కేసీఆర్.. అప్పట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరును మాత్రమే ప్రస్తావించి రేవంత్ రెడ్డిని విస్మరించారు.
Also read-Jagtial: కేసీఆర్ నోట మళ్లీ ‘పుననిర్మాణం’ పదం.. అధికార మార్పుకు సంకేతమా?
తన స్థాయికి తగ్గ వ్యక్తి కాదనా?: కేసీఆర్ ముఖ్యమంత్రి పేరును ఎత్తకపోవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది. పేరు తీసి ప్రత్యర్థి విలువ పెంచడం కంటే.. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తుచూపడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రసంగం సాగింది. తన స్థాయికి తగ్గ నాయకులతోనే పోటీ అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించాడని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

