Minister Ponguleti issue: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ముదిరి పాకాన పడింది. మంత్రి కుటుంబ సభ్యుల భూకబ్జాలు, రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఈ క్రమంలో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
గవర్నర్ను కలవనున్న బీఆర్ఎస్ నేతలు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం నేడు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలవనుంది. కేటీఆర్ నేతృత్వంలోని ఈ బృందం.. మంత్రిపై వస్తున్న ఆరోపణలు, రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలకు సంబంధించిన పూర్తి నివేదికను గవర్నర్కు సమర్పించనుంది. ఇప్పటికే అసెంబ్లీ, మండలిలో హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఈ విషయాన్ని రాజ్ భవన్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
వట్టినాగులపల్లి బాధితుల వద్దకు కేటీఆర్ బృందం: మరోవైపు వట్టినాగులపల్లిలో మంత్రి పొంగులేటి కుమారుడు హర్ష రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలపై క్షేత్రస్థాయి పర్యటనకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఉదయం కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సమావేశం అనంతరం కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం వట్టినాగులపల్లికి బయలుదేరింది. కబ్జాకు గురైన భూములను పరిశీలించి, బాధితులతో నేరుగా మాట్లాడి వారికి అండగా ఉంటామని కేటీఆర్ ప్రకటించారు.
Also read-Assembly: శాసనమండలి వద్ద హైటెన్షన్.. మంత్రి పొంగులేటి రాజీనామాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్!
కేటీఆర్ నివాసం వద్ద ఉద్రిక్తత: బీఆర్ఎస్ నేతల పర్యటన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కేటీఆర్ నివాసం వద్ద భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో “ప్రభుత్వ అండతో మంత్రి కుటుంబం చేస్తున్న భూదందాలను బట్టబయలు చేస్తాం. బాధితుల పక్షాన మా పోరాటం ఆగదు.” అని కేటీఆర్ స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

