Budget 2026 Highlights : పవిత్ర మాఘ పౌర్ణమి శుభవేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టారు. దేశం ప్రస్తుతం 7 శాతం వృద్ధి రేటుతో పటిష్టమైన ఆర్థిక స్థితిలో ఉందని, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో భాగంగా గ్లోబల్ మార్కెట్లతో పోటీపడుతూ ముందుకు సాగుతున్నామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ బడ్జెట్లో యువత, మహిళలు, విద్య , మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.
మహిళా సాధికారత , విద్యా రంగం
బాలికా విద్యను ప్రోత్సహించే దిశగా కేంద్రం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ను నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు ఉన్నత విద్య మరింత చేరువ కానుంది. అలాగే, శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఫిజిక్స్, ఆస్ట్రానమీ విభాగాల్లో అధునాతన భారీ టెలీస్కోపులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఆరోగ్య రంగం – 3 కొత్త ఎయిమ్స్ , మెడికల్ హబ్స్
- కొత్త ఎయిమ్స్: వైద్య సదుపాయాలను సామాన్యులకు చేరువ చేస్తూ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి భారీ నిధులు కేటాయించింది. దేశంలో అదనంగా మూడు కొత్త ఎయిమ్స్ (AIIMS) విద్యా సంస్థలను ఏర్పాటు చేయబోతున్నారు.
- మెడికల్ టూరిజం: భారతదేశాన్ని ప్రపంచ వైద్య కేంద్రంగా మార్చేందుకు 5 రీజినల్ మెడికల్ హబ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇది విదేశీయులను ఆకర్షించడమే కాకుండా, స్థానికులకు మెరుగైన వైద్యం అందిస్తుంది.
7 కొత్త రైలు కారిడార్లు – రవాణా రంగంలో విప్లవం
ప్రయాణ సమయాన్ని తగ్గించి, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా 7 హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రభుత్వం ప్రకటించింది. అందులో ప్రధానంగా దక్షిణ భారతదేశానికి పెద్దపీట వేయడం విశేషం..
- ముంబై – పూణే
- పూణే – హైదరాబాద్
- హైదరాబాద్ – బెంగళూరు
- బెంగళూరు – చెన్నై
- హైదరాబాద్ – చెన్నై
- ఢిల్లీ – వారణాసి
వారణాసి – సిలిగురి ఈ కారిడార్ల వల్ల తెలుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ అద్భుతంగా పెరగనుంది.
అగ్రిస్టాక్ , వ్యవసాయ రంగం
- AI టూల్: వ్యవసాయ రంగంలో సాంకేతికతను జోడిస్తూ ప్రభుత్వం “భారత్ విస్తార్” పేరుతో ఒక AI టూల్ను (అగ్రిస్టాక్ పోర్టల్) ప్రారంభించనుంది. దీని ద్వారా పంట ఉత్పత్తులు, మార్కెట్ ధరలు , భూసార పరీక్షల వివరాలను రైతులు సులభంగా తెలుసుకోవచ్చు.
- ప్రత్యేక పంటల ప్రోత్సాహం: వాల్ నట్స్ , బాదాం (ఆల్మండ్స్) వంటి ఖరీదైన పంటల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు ప్రత్యేక సబ్సిడీలు ఇవ్వనున్నారు.
యువతపై ప్రత్యేక దృష్టి సారించిన ఈ బడ్జెట్, దేశాన్ని ఆర్థికంగా మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని ఆర్థిక మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Redmi Buds 8 Pro: రెడ్మి బడ్స్ 8 ప్రో విడుదల..36 గంటల బ్యాటరీ లైఫ్..

