Central Information Commission: భారత క్రికెట్ నియంత్రణ మండలికి (BCCI) కేంద్ర సమాచార కమిషన్ (CIC) భారీ ఊరటనిచ్చింది. బీసీసీఐ సమాచార హక్కు చట్టం (RTI)-2005 పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ఆర్టీఐ చట్ట నిబంధనల ప్రకారం.. బీసీసీఐ అనేది ప్రభుత్వ సంస్థ కాదని పేర్కొంది. ఇది పూర్తిగా ఒక స్వతంత్ర సంస్థ అని కమిషన్ తేల్చిచెప్పింది.
బీసీసీఐ సొంత నిధులతో నడిచే రిజిస్టర్డ్ సొసైటీ: ఈ నిర్ణయానికి గల ప్రధాన కారణాలను సీఐసీ తన తీర్పులో వెల్లడించింది. బీసీసీఐ తన రోజువారీ కార్యకలాపాలకు గానీ, మౌలిక వసతుల కల్పనకు గానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక నిధులు (Government Funding) లేదా గ్రాంట్లు తీసుకోవడం లేదని పేర్కొంది. పూర్తిగా సొంత నిధులు, ప్రైవేట్ స్పాన్సర్షిప్లతో నడిచే ఒక రిజిస్టర్డ్ సొసైటీ అయినందున.. ఆర్టీఐ చట్టం ప్రకారం పౌరులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం క్రికెట్ బోర్డుకు లేదని స్పష్టం చేసింది. అలాగే ఈ సంస్థకు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన హోదా లేదని సీఐసీ వివరించింది.
వివాదాలకు బ్రేక్: బీసీసీఐ అంతర్గత విషయాలను ఆర్టీఐ పరిధిలోకి తేవాలంటూ జరుగుతున్న ప్రయత్నాలకు ఈ తీర్పుతో తెరపడింది. గత కొంతకాలంగా బీసీసీఐ అంతర్గత నిర్ణయాలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని పలువురు చేస్తున్న ప్రయత్నాలకు సీఐసీ ఇచ్చిన తాజా తీర్పుతో పూర్తిగా బ్రేక్ పడినట్లయింది.

